Nepal Tour (నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర) 9-4-18 to 24-4-18

Nepal Tour (నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర) 9-4-18 to 24-4-18

నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర అనుకోకుండా ప్రాప్తించింది.  టూర్ గురించి శివరాత్రి రోజే వినడం, అదేదో దైవ సంకల్పంలా అనిపించి సరే అనడం జరిగిపోయింది. మా చిన్న చెల్లి కూడా జత కలిసింది. కామాక్షి గారు, మా వారి ప్రొఫెసర్ గారి భార్య, ఆమె చెప్పగా ఆమెతో కలసి ఈ యాత్రకు బయలుదేరాం. మేము” శివానంద ప్రభు అని, కొవ్వూరులో (రాజమండ్రి దగ్గర) గోష్పాద క్షేత్రం నిర్వాహకులతో ఈ యాత్రకు వైజాగ్ లో 9-4-18 న బయలు దేరాం. తారాపీఠ్, బాసుకినాధ్ టెంపుల్, బైద్యనాధ్ టెంపుల్ చూసుకుని బస్సులో రాక్సోల్ గుండా 13-4-18 వేకువనే నేపాల్ ఎంటర్ అయ్యాం. కళ్ళు తెరిచి చూడగానే మంచు కొండలు. చాలా అద్భుతంగా అనిపించింది. ఏమో! నాకైతే అలా చూస్తుంటే దేవుని భూమికి వచ్చాం అనిపించింది. 8am కు పోఖరా విమానాశ్రయానికి చేరుకున్నాం. వెంటనే చిన్న ఫ్లైట్ లో ముక్తినాధ్ కు బయలు దేరాం. ఎక్కిన ఫ్లైట్ నాకైతే  బొమ్మలా అనిపించింది. గంట జర్నీ. మొత్తం జర్నీ కొండల మీద నుండే. పెద్ద పెద్ద వృక్షాలు, గుత్తు, గుత్తులుగా పూలు, చిన్న చిన్న గ్రామాలు, సెల ఏరులు. మీద నుండి చూస్తుంటే వ్యూ అద్భుతం.


13-4-19

Pokhara to Jomsom to Muktinadh to Jomsom

9am కు జెంషుం (Jomsom) చేరుకున్నాం. జెంషుం విమానాశ్రయములో దిగగానే హిమాలయాల దగ్గర ఉన్నట్లుంటుంది. చుట్టూ పచ్చదనం. మంచుతో కప్పబడిన పర్వతాలు. నీలి ఆకాశం. తెల్లని మబ్బులు. వర్ణ చిత్రంలా అనిపిస్తుంది. విమానాశ్రయానికి దగ్గరలో Hotel Trekker’s Inn లో బస. ఇది ఒక పేయింగ్ గెస్ట్ ఎకామిడేషన్. ఇక్కడ ఎక్కువ హోటల్స్ ఇలాగే ఉంటాయి. మనం ఆర్డర్ చేస్తే భోజనం తయారు చేస్తారు. గంటలో రెడీ అయి వేన్ లో ముక్తినాధ్ధ్ బయలు దేరాం. త్రోవంతా రాళ్ళు, రప్పలే. గండకీ నది అంచు నుండి, మధ్యలో నుండి, కొండల మీద నుండి, అంచుల నుండి ప్రయాణం. గంటలో ముక్తినాధ్ధ్  చేరుకున్నాం. 

 

ముక్తినాధ్ధ్ అంటే మోక్షాన్ని ప్రసాదించే నాధుడు అని అర్ధం. ఇది హిందువులకు, బౌద్ధులకూ అతి ముఖ్యమైన క్షేత్రం. వైష్టవ సంప్రదాయంలో 108 దివ్య క్షేత్రాలలో ఇది 106 వది అంటారు. 107 పాల సముద్రం, 108 పరమ పదం. ఇది సముద్రమట్టానికి 3800m ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రవహించే కాలా గండకి నదిలో సాలగ్రామాలు దొరుకుతాయి.

 ఇది మూడు అంతస్తుల పగోడా.  ఇక్కడ పంచ భూతాలు (నీరు, వాయువు, అగ్ని, భూమి, ఆకాశం) కొలువై ఉన్నాయని నమ్మకం. విష్ణువు ఇక్కడ ముక్తినాధుని రూపంలో శ్రీదేవి, భూదేవి సమేతుడై ఉంటాడు. గుడి చిన్నదే. స్వామి విగ్రహం బంగారంతో చేసినది. గర్భ గుడి లోపలకు ఎవరినీ రానివ్వరు. ద్వారం దగ్గర నిలబడి స్వామిని దర్శించుకుంటారు. ఎంతసేపు నిలబడినా వెళ్ళి పొమ్మని ఎవరూ అనరు.  బౌద్ధులకు ముక్తినాధ్, అవలోకితేశ్వర అవతారం.

 

కోవెల ముందు రెండు నీటి కుండాలు ఉంటాయి. ఒకటి పుణ్య కుండం , ఒకటి పాప కుండం. టెంపుల్ వెనుక 108 నీటి ధారలు ఉంటాయి. 108 క్షేత్రాలను సూచిస్తాయని అంటారు. అతి శీతల జలాలు. మీద పడితే జిల్లుమంటుంది. వాటి క్రింద స్నానం చేస్తే 108 క్షేత్రాలలో చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పారు. చేసిన పాపాలు చేసేసి, ఇలా చేస్తే పుణ్యం వస్తుందన్న భ్రమ నాకైతే లేదు గాని, మా కుండా పెద్ద వాళ్ళు ఇద్దరు స్నానం చేసారు. అందుకని మాకూ ధైర్యం వచ్చి మేమూ చేసాం. నీటిధారలలో స్నానం చేసాక, బట్టలు మార్చుకునే ఏర్పాటు ఉంది. స్నానం చేయలేని వాళ్ళు నీళ్ళు తల మీద జల్లుకుంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద, పెద్ద రుద్రాక్ష వృక్షాలు. వెనుక మంచు పర్వతాలు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ నిత్యమూ హోమం చేస్తారు. అక్కడే శివ కోవెల కూడా ఉంటుంది. బయటకు వస్తే కొంచెం దూరంలో బుద్ధుని విగ్రహం  పెద్దది ఉంటుంది. చాలా బాగుంటుంది.


108నీటి ధారలు
అతి శీతల జలాలు
108 క్షేత్రాల నుండి జాలువారు
అట స్నానించి భక్తులు పరవశించినారు







మూడు నామాల వాడు
ముద్ద్దు ముద్దుగున్నాడు
ముచ్చట గొలుపుతున్నాడు
శ్రీదేవి, భూదేవిలతో కొలువైఉన్నాడు
దండిగా దర్శనమిచ్చినాడు
సంధ్య వెలుగులో మెరిసిపోతున్నాడు
మనసంతా నిండిపోయినాడు
ఎంత చూసినా తనివితీరదు
అందుకే దాచినాను స్వామిరూపం
కెమెరా కన్నులో






ఎక్కువ మంది యాత్రీకులు ఉండరు. మనం జీప్ దిగాక 1-2km నడవాల్సి ఉంటుంది. లేకపోతే పోనీలు దొరుకుతాయి. ఊరి (రానిపౌవా) మధ్యలో నుండి నడుస్తాం. చిన్న, చిన్న హోటెళ్ళు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్  దొరుకుతాయి. రుద్రాక్షలు, సాలగ్రామాలు ఇంకా పూసలూ ఇళ్ళ ముందర పెట్టి   అమ్ముతున్నారు. ఎత్తులో ఉంది కాబట్టి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడవచ్చు. పచ్చ కర్పూరం తెచ్చుకున్నారు కొంతమంది. అది ముక్కు దగ్గర పెట్టుకుంటే ఊపిరి ఫ్రీగా తీసుకోవచ్చట. 

 పొఖర నుండి బస్సులో గా ని , ప్రైవేట్ వెహికిల్ లో గాని కు వెళ్ళవచ్చు. సరి అయిన రోడ్డు లేదు. కొండల అంచున ఊగుతూ బస్సు వెళ్తుంటే, క్రిందకు చూస్తే చాలా భయమేస్తుంది. కాని డ్రైవర్లు చాలా చాకచక్యంగా వాహనాలను. నడుపుతారు. నేను మరల 2019 లో ఫ్లైట్ లేకపోతే టాటా సుమోలో వెళ్ళాము. ఉదయం 5am కు బయలుదేరితే ఈవెనింగ్ 5pm అయింది. దర్శనం చేసుకుని రాత్రికి  Jomsom చేరుకున్నాం. Jomsom నుండి రానిపౌవా ఊరి వరకు ఇప్పుడు మంచి రోడ్డు వేసారు. ఆ ఊరి నుండి నడక లేదా పోనీ తీసుకోవాలి. 300 నుండి 500/- తీసుకుంటారు. ఇక్కడ సూర్యాస్తమయం 7-7.30pm మధ్యలో ఉంటుంది.

 14-4-18

Jomsom to Pokhara

ఫ్లైట్ లో పోఖరా చేరుకున్నాం. Hotel “Stay Pokhara”

ఈవెనింగ్ వింధ్యవాసిని టెంపుల్ కు వెళ్ళాం. ఇది గండకి స్టేట్ లో, కాస్కి జిల్లాలో పొఖరా టౌన్ లో ఉంది.  ఇది కొండమీద ఉంటుంది. మరీ ఎక్కువ ఎత్తులో ఉండదు. ఇక్కడే రాధా కృష్టులు, లక్ష్మీ నారాయణులు, సీతారాముల (ఇవన్నీ పాలరాతి విగ్రహాలు) కోవెలల తో పాటు శివ కోవెల కూడా ఉంటుంది. చతుర్ముఖ శివ లింగం. ఇదే పెద్దది. అమ్మవారి కోవెల చిన్నదే. టెంపుల్ దగ్గర నుండి వ్యూ బాగుంటుంది. మెట్లు దిగాక, క్రింద అన్ని షాపులు ఉంటాయి రుద్రాక్షలు, ముత్యాలు, కెంపుల, పచ్చల పూసలు అమ్ముతారు.




15-4-18

Pokhara to Manokamana to Khatmandu

వారాహి మాత టెంపుల్ కు వెళ్ళాం. ఇది గండకి స్టేట్ లో, కాస్కి జిల్లాలో పొఖరా టౌన్ లో ఉంది.  ఇది లేక్ మధ్యలో ఉంటుంది. బాగా జనాలు ఉన్నారు. చాలా బోట్లు ఉన్నాయి. తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు వేసుకోవలసిందే. అవి తీసుకున్నాకే టికెట్లు ఇస్తారు. క్యూలలో పంపించారు. చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. లేక్ మధ్యలో చిన్న ద్వీపం. చాలా పావురాలు ఉన్నాయి. అమ్మవారి కోవెల చిన్నదే. ఇది రెండు అంతస్తుల పగోడా. ఇక్కడ గుడి లోపలకు రెండు అడుగులు క్రిందకు దిగి వెళ్ళాలి. ఫెవ లేక్ చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తైన పర్వతాలు. లేక్ మధ్యలో కోవెల. 







అక్కడనుండి గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కు వెళ్ళాం.లోపలకు వెళ్ళే త్రోవంతా షాపులే. టికెట్ తీసుకొని మెట్లు దిగి క్రిందకు కేవ్ లోకి వెళితే అక్కడ మహాదేవుని విగ్రహం ఉంటుంది. ఇంకా లోపలకు వెళితే చీకటిగా ఉంటుంది గాని వాటర్ ఫాల్స్ పడే శబ్దం వినిపిస్తుంది. కొద్దిగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ గుహ లోపల, ఒక చిన్న గది, ఒక దారిలో వెళ్ళి వేరొక దారిలో వచ్చేటట్లు ఉంటుంది. లోపల కామ ధేనువు ఉంది. దానికి ఎంతో టికెట్ పెట్టారు. లోపల ఇంకా పార్వతి అమ్మ వారు, సరస్వతి దేవి. విఘ్నేశ్వరుడు విగ్రహాలు చిన్నవి ఉన్నాయి. లోపల అంతా చిత్తడిగా ఉంటుంది. జాగ్రత్తగా నడవాలి. ఇంకా క్రిందకు దిగడానికి ఐరన్ రెయిలింగ్ ఉంది. దిగితే Devis Water falls (వాటర్  ఫాల్స్) కనిపిస్తాయి. ఇదంతా టవున్ మధ్యలో ఉంది. బయటకు ఏమీ కనిపించదు. మెట్లు దిగి క్రిందకు వెళితే ఇవన్నీ కనిపిస్తాయి.

 






ఇక్కడ నుండి మనోకామన తల్లినిచూడటానికి బస్సులో వెళ్ళాం. త్రోవలో ఒక పక్క కొండలు. ఇంకో పక్క నది, దానిని ఆనుకుని మరల కొండలు, ఒక్కో దగ్గర పల్లెటూరు, మధ్య మధ్య ఇనుప మెష్ తో కట్టిన వంతెనలు, మనుషుల రాకపోకలకు. రోడ్డు సైడ్ ఉన్న కొండలు ఎక్కువగా సేండ్ హిల్స్. చూస్తుంటే గాబరా పుట్టేది, ఆ కొండ అలా జారీ పడిపోవచ్చని. ఎందుకంటే ఇసుక లూజ్ గా ఉన్నట్లు అనిపించేది. 

 2pm కు మానోకామన చేరుకున్నాం. అక్కడ 2.8km కేబుల్ కారు ఎక్కాలి. 2-3pm మధ్య టికెట్లు ఇవ్వరు. లంచ్ బ్రేక్. ఈ లోగా మేము లంచ్ చేసేసాం. టికెట్ Rs 500/- . చుట్టూ చక్కటి గార్డెన్ పెంచారు. రోప్ వే మీద వెళ్ళడానికి 15-20minutes పట్టింది. మీదకు వెల్తున్న కొద్దీ కొండల ఎత్తు పెరుగుతుంది. క్రిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. చాలా ఎత్తైన రోప్ వే. కొండ మీద కూడా చక్కని గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. మీద పెద్ద ఊరే ఉంది.  రోప్ వే త్రోవలో చూస్తే అంత ఎత్తైన కొండల మీద కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఊరి చివర మనోకామన అమ్మవారి ఆలయం ఉంది. కొన్ని దగ్గర ల మెట్లు. కొంత దూరం ప్లైన్ ఏరియా. అలా ఉంది త్రోవ. త్రోవ పొడుగునా షాపులే.

కోరిన కోర్కెలు తీర్చే తల్లి అని ప్రసిద్ధి. చాలా మంది ఉన్నారు. ఇంతకీ అమ్మవారి కోవెల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. బయట చిన్న షెడ్ లో అమ్మవారిని పెట్టీ పూజలు చేస్తున్నారు. దర్శనమ్ బాగా అయింది. అమ్మవారంటే విగ్రహం అదీ ఉండదు.  ఒక రాయి మాత్రమే .






క్రిందకు దిగడానికి వచ్చేసరికి పెద్ద క్యూ ఉంది. 5.30 కి క్రిందకు వచ్చేశాము. ఖాట్మండు చేరేసరికి 9.30pm.  Hotel  Pasupati Plaza లో స్టే చేశాం.

 16-4-18

Khatmandu

6.30am కి రెడీ అయి పశుపతి నాథ్ టెంపుల్ కి వెళ్ళాం. చాలా పెద్ద క్యూ ఉంది.  జనాలు ఓపికగా క్యూలో ఉంటారు. UNESCO World Heritage Site (హెరిటేజ్ సైట్). మమ్మల్ని అందరినీ ఒక పక్క కూచోబెట్టి అక్కడ ఒక పంతులుగారితో పూజ చేయించి, అప్పుడు క్యూలోకి వెళ్ళాము. ఆ పంతులు గారు మమ్మల్ని క్యూ తప్పించి లోపలకు తీసుకు వెళ్ళారు.




పగోడా స్టయిల్ లో కోవెల ఉంటుంది. మన ఇండియా లో ఉన్నట్లు గోపురం ఉండదు. బంగారు పూత తో ఉంటుంది. గోడలు వెండి పూత తో కట్టారు.

గర్భ గుడికి నాలుగు దిక్కులా    నాలుగు ద్వారాలు ఉంటాయి. పశ్చిమ ద్వారం ముందు తెరుస్తారు.  రోజూ ఉదయం 4.30amకు, ముందు పశ్చిమ ద్వారం తెరుస్తారు. తర్వాత మిగిలిన ద్వారాలు తెరుస్తారు. పశ్చిమ ద్వారం ముందు ఇత్తడితో చేసిన పెద్ద నంది ఉంటుంది. దాని క్రింద రాతి నంది చిన్నది ఉంటుంది. పశ్చిమ ద్వారం ముందు ఎక్కి దిగడానికి మెట్లు ఉంటాయి. అవి ఎక్కి శివుణ్ణి చూడవచ్చు.

టెంపుల్ కు 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మెయిన్ ది పశ్చిమ ద్వారం. మిగిలిన ద్వారాలు ప్రత్యేక దినాలలోనే తెరుస్తారు. 9-11am వరకూ  శివునికి  అభిషేకం చేస్తారు. ఆ సమయంలో నాలుగు ద్వారాలు తెరిచి ఉంటాయి. 5am-2pm & 5pm-7pm వరకూ దర్శన వేళలు. ఇక్కడ గర్భ గుడి లోపలకు పూజారులకు తప్పించి వేరే వారికి ప్రవేశం ఉండదు. అన్ని శివాలయాలలో లాగ ఇక్కడ శివ లింగాన్ని తాకకూడదు. ఇక్కడ లింగం పంచ ముఖ శివలింగం.

పశుపతినాధుని పంచ ముఖాలు, అవి దిక్కుకు ఉంటాయి, అవి వేటికి ఆధిపత్యం వహిస్తాయి క్రింద సూచించాను.

అఘోర- దక్షిణ దిక్కు- అగ్ని

ఈశాన- ఆకాశం వేపు- ఆకాశం

వామదేవ-ఉత్తర దిక్కు- నీరు

తత్పురుష- తూర్పు దిక్కు- వాయువు

సద్యోజాత- పశ్చిమ దిక్కు- భూమి

ఒక్కో ముఖం ఒక్కో దిక్కుకు చూస్తూ, పంచ భూతాలను సూచిస్తుంది.

 టెంపుల్ కాంప్లెక్స్ లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి. ఎక్కువగా శివ లింగాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినది ఉన్మత్త భైరవ విగ్రహం. 8 అడుగుల ఎత్తులో పెద్ద కళ్ళతో ఉంటుంది. తప్పనిసరిగా ఈయన దర్శనం చేసుకుంటారు. ఇంకా వాసుకినాధ్, సూర్య నారాయణ, హనుమ, కీర్తిముఖ, బుధ్ నీలకంఠ విగ్రహాలు, 184 శివ లింగాలు ఉంటాయి. టెంపుల్ లోపలకు హిందువులకు, బౌద్ధులకు మాత్రమే ప్రవేశం. మొబైల్ ఫోన్లు లోపలకు తీసుకు వెళ్లనివ్వరు. మిలిటరీ బలగాలు పహారా కాస్తాయి.

టెంపుల్ కాంప్లెక్స్ వెలుపల 12 జ్యోతిర్లింగాలు, రామ మందిరం, విరాట్ స్వరూప మందిరాలు, గుజ్యేస్వరి (గుహ్యేశ్వరి ) మాత ఆలయం ఉంటాయి. పశుపతినాధ్ ఆలయం నుండి గుహ్యేశ్వరి మాత ఆలయానికి కొండ మీద నుండి వెళ్ళే మెట్ల దారిలో ఈ ఆలయాలు ఉంటాయి. పక్కనే భాగమతి నది ప్రవహిస్తుంది. దాని ఒడ్డున దహన సంస్కారాలు చేయడానికి ప్లాట్ ఫారాలు ఉన్నాయి.

 




జనన మరణ అభేదం, శ్మశానే వసంతం, శ్మశానే నివాసం….అందుకేనేమో ఆలయాన్ని ఆనుకునే రుద్ర భూమి ఉంటుంది ఇటు కోవెలలో పూజలు, అటు బయట దహన సంస్కారాలు ,...జరుగుతుంటాయి. కోవెల కాస్త ఎత్తుగా ఉంటుంది. అక్కడ నుండి చూస్తే, పక్కనే ఈ కార్యక్రమాలు కనిపిస్తాయి. నేనైతే ముందు హోమం చేస్తున్నారని అనుకున్నా. తర్వాత అర్థమయింది. రాత్రి భాగమతి నదికి గంగా హారతి ఇస్తారు. రావణునిచే ఆలపింపబడిన శివ తాండవం పాడతారు. చాలా మంది వస్తారు అది చూడటానికి.

కొండకు ఇటువేపు పశుపతినాధుడు ఉంటే, ఆవల వేపు గుహ్యేశ్వరి మాత ఉంటుంది. కొండమీద నుండి మెట్ల మార్గం ఉంటుంది. లేకపోతే ఊరిలో నుండి రోడ్డు మీద నుండి వెళ్ళవచ్చు. భాగమతి నది ప్రక్కన ప్రవహిస్తుంది.

 గుహ్యేశ్వరి మాత ఆలయం: ఇది ఒక శక్తి పీఠం. సతి దేవి పృష్ట భాగం (Hip part) పడిందని అంటారు. గుహ్యము అంటే కనిపించనిది అని అర్ధము. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు. 6-7మెట్లు క్రిందకు దిగితే అక్కడ కలశం రూపంలో ఉంటారు. ఆ కలశం క్రింద నీటి కయ్య (Natural Spring) ఉంటుంది. మనకు ఆ నీరు కలశం చుట్టూ కనిపిస్తుంది. మనం ఆ కలశాన్ని, ఆ నీటిని ముట్టుకోవచ్చు. గుడి మూసి వేసే ముందు  అక్కడంతా శుభ్రం చేసి,  కవచంతో (Oval shaped Brass shield) కప్పి ఉంచుతారు. ఇది తాంత్రిక పీఠం. అందుకే ముఖ ద్వారానికి ఒక వేపు ఒక కన్ను, ఇంకో వేపు అస్థి పంజరం ఉన్నాయి.

 ఖాట్మండులో వేకువనే రడీ అయి పశుపతినాధుని దర్శనానికి బయలు దేరాం.  పశుపతినాధుని దర్శనం, గుహ్యేశ్వరి మాత దర్శనం చేసుకొన్నాంజనం ఎక్కువగానే ఉన్నా దర్శనం చక్కగా అయింది.

బుధ నీలకంఠ (జల నారాయణుడు), నల్ల రాతితో చెక్కిన 5m పొడవు, శేష పాన్పు పై ఉన్నట్లు ఉన్న విష్ణు మూర్తి విగ్రహం, 12m పొడవున్న కొలనులో తేలుతూ ఉంటుంది. చేతిలో శంఖం చక్రం గద ఉంటాయి. ఇక్కడేమీ గుడి ఉండదు. ఒపెన్ ప్లేస్ లో ఉంటుంది. కొలనులో నీరు పరిశుభ్రంగా ఉండదు. అక్కడ పూజారికి డబ్బులిస్తే ఫోటో తీసుకోనిస్తాడు. లేకపోతే ఒప్పుకోడు.






స్వయంభునాధ్ టెంపుల్: ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. చుట్టూ ప్రహరి ఉంటుంది. ఆ ప్రహరి పొడవునా ఇత్తడితో చేసిన గిలకలు ఉంటాయి. వాటి లోపల బౌద్ధులకు సంబందించిన పవిత్ర గ్రంధాల్లోని విషయాలు రాసి ఉంటాయట. అందుకని వాళ్ళు ఆ గిలకలను చేతితో తిప్పుతూ నడుస్తారు. తూర్పు వేపు మెట్ల దారి ఉంటుంది. మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. పడమర దిక్కులో రోడ్డు ఉంటుంది. గేట్ దగ్గర దిగి లోపలకు చాలా దూరం నడవాల్సి ఉంటుంది. పచ్చని చెట్లతో, పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. టికెట్ 50రూపాయలు.

ఇక్కడ పెద్ద స్థూపం ఉంటుంది.ఆ స్థూపం మీద నాలుగు దిక్కులా రెండు కళ్ళు ఉంటాయి. మధ్యలో ముక్కు ఉన్నట్లుంటుంది. ఈ స్థూపం చుట్టూ కూడా గిలకలు ఉంటాయి. అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక్కడ మ్యూజియం ఉంది. అందులో శయనించిన బుద్ధ విగ్రహం ఉంది. ఇంకో వేపు సరస్వతి దేవి కోవెల ఉంది. ఇక్కడ అన్ని రకాల షాపులూ ఉన్నాయి.




ఆ తర్వాత జనక్ పూర్ (జానకి మాత పుట్టిన ఊరు), అస్సాం లో కామాఖ్య అమ్మవారి టెంపుల్, డార్జిలింగ్ చూసుకొని, మాయాపూర్ (ఇది కృష్ణ చైతన్య ప్రభు పుట్టిన స్థలం) మీదుగా వైజాగ్ 25-4-18 న చేరుకున్నాం.





P.S.:పై వివరాలు చదివాక మీ స్పందన (comment) ను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

Tour Organiser:

Shivananda Swami (mobile 9032964086, 850194086)

Srimad Bhagavat Geeta Mandir, Goshpada Kshetram

Kovvur, West Godavari 

Andhra Pradesh, 532350


 

 

.

 

.

 

 


Comments

  1. Your tour seems to be consequence of divine grace as the idea began on MahaSivarathri for Nepal, synonym to Lord Pasupatinadh. Having sister as travel partner is definitely best and happy thing. Insights of many sacred places gained through your narrative of this Nepal tour. About Muktinadh , sacred place of salvation or kaliGandaki river, the place to find Saligrams etc.,are well mentioned.The description regarding the significance of Lord Pasupatinadh , with five faces of East, West, south, North and zenith symbolising Panchboothas is very enlightened. The detailed review of your pilgrimage with photos presents a comprehensive way to visualise the visited places of your tour. Prof. K.Chandra Mouli

    ReplyDelete
    Replies
    1. Thank you professor Chandra mouli garu for your analytical comments

      Delete

Post a Comment

Popular posts from this blog

Sri lanka Tour from 4-1-2019 to 12-1-2019

ఎండాకాలం